మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్లో (Philippines) మిండానావో ద్వీపం వరుస భూకంపాలతో వణికిపోతున్నది. గత శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం (Earthquake) వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మిండానావో ద్వీపంలోని (Mindanao island) హినాటువాన్ మున్సిపాలిటీలో (Hinatuan municipality) మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 6.9గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. హినాటువాన్కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, ఆదివారం సాయంత్రం కూడా 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఇక శనివారం ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం నాటి భూకంపం వల్ల ఇద్దరు మరణించారు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు.