scuba divers : పర్యాటక కేంద్రమైన మాల్దీవుల్లో విషాదం జరిగింది. అక్కడి దీవుల్లోని ఒక సముద్ర గర్భంలోని గుహలోకి స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్లిన ఐదుగురు అన్వేషకులు ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కూబా డైవింగ్ ప్రమాదమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక మీడియా, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటలీకి చెందిన మోనికా మాంటెఫాల్కన్, జార్జియా సోమాకల్, ఫెడెరికో గ్వాల్టైరి, మ్యురియెల్ ఒడెనినో, జియాన్లుకా బెనెడెట్టి అనే ఐదుగురు స్కూబా డైవర్లు వావు అటోల్ అనే సముద్ర గర్భంలోని గుహలోకి గురువారం నాడు అన్వేషణకు వెళ్లారు.
ఇది దాదాపు 50 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. నీళ్లలో అన్వేషణకు వెళ్లిన వారు ఎంతసేపటికీ పైకి రాలేదు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, రక్షక దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఐదుగురి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. వీరిలో బెనెడెట్టి అనే ఒక స్కూబా డైవర్ మృతదేహం మాత్రమే దొరికింది. నీళ్లలో గుహ ముఖద్వారం వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. మిగతా నలుగురి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శుక్రవారం నుంచి ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎనిమిది మంది డైవర్లు ఇందులో పాల్గొంటున్నట్లు మాల్దీవ్స్ అధికారులు తెలిపారు. ఇటలీకి చెందిన మరో ఇద్దరు డైవర్లు కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.ఈ విషయంలో ఇటలీ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందన్నారు. కాగా, ఈ ఐదుగురు స్కూబా డైవర్ల మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, లోపలి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే కారణాలుగా అనుమానిస్తున్నారు.