జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో (South Africa) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. దీంతో 45 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. 165 అడుగుల లోతులో పడిపోవడంతో బస్సులో మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. వారంతా బోట్స్వానా నుంచి మోరియోకు వెళ్తున్నారని వెల్లడించారు.
కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో బస్సు లోయలో పడిపోయిందన్నారు. ప్రాణాలతో బయటపడిన బాలికను దవాఖానకు తరలించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. కాగా, ప్రమాద ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.