Russia | రష్యాలోని ఉఫా నగరంలో చోటుచేసుకున్న కత్తి దాడి ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు మరికొందరు గాయపడినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాష్కోర్టోస్థాన్ రిపబ్లిక్లో ఉన్న ఒక స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకోగా, మొత్తం కనీసం ఆరుగురు గాయపడినట్లు సమాచారం.ఉఫాలో ఒక దురదృష్టకర దాడి జరిగింది. నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు పలువురు గాయపడ్డారు. మేము స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. గాయపడిన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు కజాన్లోని భారత కాన్సులేట్ అధికారులు ఉఫాకు బయలుదేరినట్లు తెలిపింది. అయితే గాయపడిన భారతీయుల వ్యక్తిగత వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, శనివారం ఒక 15 ఏళ్ల బాలుడు ఉఫాలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించి డార్మిటరీ (వసతి గృహం)లోకి చొరబడ్డాడు. అక్కడ ఉన్న విద్యార్థులపై ఆకస్మికంగా కత్తితో దాడి చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా, తనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు పోలీసు అధికారులపై కూడా కత్తితో దాడి చేశాడు. అరెస్టును ప్రతిఘటించే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. అనంతరం నిందితుడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు” అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇరినా వోల్క్ తెలిపారు.
రష్యా ఫెడరల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, గాయపడిన వారిలో నలుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడైన 15 ఏళ్ల బాలుడిని కూడా చిన్నారుల ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్ల కథనాల ప్రకారం, నిందితుడు నిషేధిత నియో–నాజీ భావజాలంతో సంబంధం కలిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో అతడు జాతీయవాద నినాదాలు చేసినట్లు, గోడపై స్వస్తిక గుర్తు గీసినట్లు కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.