టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ నైతిక పోలీసుల దాడిలో గత శనివారం మరణించింది. దీంతో గత ఆరు రోజులుగా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే నిరసనలను అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పని చేస్తున్న ఎన్జీవో సంస్థ గురువారం తెలిపింది.
కాగా, ఇరాన్ ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, మానవ గౌరవం కోసం వీధుల్లోకి వచ్చారని ఇరాన్ మానవ హక్కుల (ఐహెచ్ఆర్) డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ తెలిపారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం బుల్లెట్లతో ప్రతిస్పందిస్తోందని ఆయన విమర్శించారు. 30కిపైగా నగరాలు, పట్టణాల్లో ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక కార్యకర్తలు, నిరసనకారులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారని, ఇది ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఉత్తర మజాందరన్ ప్రావిన్స్లోని అమోల్ పట్టణంలో బుధవారం రాత్రి 11 మంది మరణించగా, అదే ప్రావిన్స్లోని బాబోల్లో ఆరుగురు చనిపోయినట్లు పేర్కొన్నారు.
మరోవైపు హిజాబ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. నిరసనలను అణచివేయడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించింది. తాజాగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ను కూడా బ్లాక్ చేసింది. ఇప్పటికే ఇరాన్లో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్లను బ్లాక్ చేశారు.