కరాచీ, ఫిబ్రవరి 7:వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ దద్దరిల్లిపోయింది. బుధవారం బలూచిస్థాన్లో చోటుచేసుకున్న జంట పేలుళ్లలో 30 మందికి పైగా మృతిచెందగా, మరో 42 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మరుసటి రోజు సార్వత్రిక ఎన్నికలకు దేశం యావత్తు సిద్ధమవుతున్న వేళఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పిషిన్ జిల్లాలో మొదటి బాంబు పేలుడు సంభవించగా, ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో గంటలో బలూచిస్థాన్ పంజ్గుర్లో రెండో బాంబు పేలింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు.
జాతీయ అసెంబ్లీతో పాటు పలు రాష్ర్టాల అసెంబ్లీలకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, ఇటీవలే లండన్ నుంచి వచ్చిన మరో మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ నేత నవాజ్ షరీఫ్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నారు