లండన్, అక్టోబర్ 10: బ్రిటన్లో ఓ మహిళ కిడ్నాప్ కేసులో ముగ్గురు భారత సంతతి యువకులకు స్థానిక కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అజయ్ దొప్పలపూడి (27), వాహర్ మంచాల (24), రానా యెల్లంబాయ్ (30)లను దోషులుగా తేల్చింది. ‘ముందస్తు ప్రణాళికతో ఈ ముగ్గురు మహిళను కిడ్నాప్ చేశారు. లైంగికదాడికి పాల్పడాలన్నది వారి ప్రణాళిక’ అని డిటెక్టివ్ కానిస్టేబుల్ జెమ్మా ఫాక్స్ చెప్పారు. గత ఏడాది జనవరి 16న తూర్పు ఇంగ్లండ్లో లీసెస్టర్ సిటీ సెంటర్ వద్ద నిందితుల కారును ట్యాక్సీగా భావించి బాధిత మహిళ వారితో ఆ వాహనంలో వెళ్లింది. ఆమె ఇంటివద్ద కారు ఆపకుండా.. నిర్మానుష్య ప్రాంతానికి బాధిత మహిళను తీసుకెళ్లటంతో, అనుమానం వచ్చి ఆమె అక్కడ్నుంచి తప్పించుకుంది.