ట్రిపోలి: లిబియాలో రెండు సాయుధ గ్రూపుల నడుమ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గత సోమవారం నుంచి కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో ఆ రెండు గ్రూపుల వాళ్లే కాకుండా సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
సోమవారం 444 బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ హమ్జాను స్పెషల్ డిటెర్రెన్స్ దళం బంధించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. ఈ స్పెషల్ డిటెర్రెన్స్ దళం అనేది 444 బ్రిగేడ్కు ఉన్న బద్ధ శత్రువుల్లో ఒకటి. ఈ క్రమంలో మహ్మద్ హమ్జా స్పెషల్ డిటెర్రెన్స్ దళం ఆధీనంలోని మెయిన్ మిటిగా ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణం చేసేందుకు ప్రయత్నించాడు.
దాంతో స్పెషల్ డిటెర్రెన్స్ దళం అతడిని బంధించింది. అయితే, పోరాడేందుకు కాకుండా ప్రయాణం చేసేందుకు నిరాయుధుడిగా వచ్చిన హమ్జాను స్పెషల్ డిటెర్రెన్స్ దళం ఎందుకు బంధించాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.