Pakistan : పాకిస్తాన్లో కొంతకాలంగా పాక్ సైన్యానికి, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కు మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుపక్షాలు పరస్పరం దాడి చేసుకుంటున్నాయి. తాజాగా బీఎల్ఏ జరిపిన దాడిలో 25 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ విషయాన్ని బీఎల్ఏ తాజాగా వెల్లడించింది. పాక్ దాడులకు బదులుగా, బీఎల్ఏ జరిపిన వేర్వేరు దాడుల్లో పాక్ సైనికులు మరణించినట్లు తెలిపింది.
దీంతో బెలూచిస్తాన్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీఎల్ఏ రిలీజ్ చేసింది. బీఎల్ఏకు చెందిన ఫతేహ్ స్క్వాడ్ ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. శుక్రవారం జియారత్ క్రాస్ వద్ద పాక్ మిలిటరీ కాన్వాయ్కు చెందిన రెండు వాహనాలు వెళ్తుండగా బీఎల్ఏ దాడి చేసింది. ఈ ఘటనలో 18 మంది పాక్ సైనికులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఫతేహ్ స్క్వాడ్.. బీఎల్ఏలో చాలా బలమైన సాయుధ రెబల్ గ్రూప్. బెలూచిస్తాన్ పర్వత ప్రాంతాల్లో, గ్వెరిల్లా తరహా మెరుపు దాడులు చేయగల సామర్ధ్యం ఈ గ్రూప్ సొంతం.
ప్రమాదకరమైన దాడుల్ని ఈ గ్రూప్ చేపడుతుంది. గత ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసింది కూడా ఈ గ్రూపే. మరో ఘటన సూరబ్ పరిధిలోని హజికా ప్రాంతంలో జరిగింది. బీఎల్ఏకు చెందిన ఎస్టీఓఎస్ గ్రూపు పాక్ సైన్యంపై దాడి చేసింది. రిమోట్ కంట్రోల్ వాహనంతో దాడి చేయగా, ఏడుగురు సైనికులు మరణించారు. ఈ రెండు దాడులపై పాక్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ ఘటనలు పాక్ సైన్యం వైఫల్యంగా అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైఫల్యంగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెలూచిస్తాన్లో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బలూచ్ పౌరులు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని కోరుకుంటూ పోరాటం చేస్తున్నారు. అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తోంది.