వాషింగ్టన్: క్రిస్మస్ సెలవులకు ముందు ప్రతికూల వాతావరణం అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మంచు, వాన, గాలి, శీతల ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యమంతటా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజారవాణా సేవలకు అంతరాయం కలుగుతున్నది. దేశవ్యాప్తంగా భారీగా మంచు కురుస్తుండటంతోపాటు ఉష్ణోగ్రతలు మైనస్లోకి పడిపోవడంతో దేశవ్యాప్తంగా 2270కి పైగా విమానాలు రద్దయ్యాయి.
దీంతో గురువారం సాయంత్రం 6 గంటల వరకు (స్థానిక కాలమానం ప్రకారం) 2,270 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందస్తుగా శుక్రవారం సుమారు 1,000 విమానాలను క్యాన్సల్ అయ్యాయి. శనివారం మరో 85 విమానాలను రద్దు చేశారు.
కాగా, గురువారం 7400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. వాటిలో అత్యధికంగా చికాగో, డెన్వర్ నుంచి వచ్చి, పోయే విమానాలే పావు వంతు ఉన్నాయి. అమెరికాలో ఎక్కువగా ఈ రెండు విమానాశ్రయాల నుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక చికాగోలో మూడు గంటల పాటు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.