రేపటి నుంచి ధర్మపురి నారసింహుడి బ్రహ్మోత్సవాలు
వచ్చే నెల 5వరకు వేడుకలు
13 రోజులపాటు కార్యక్రమాలు
తరలిరానున్న భక్తజనం
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
ధర్మపురి, మార్చి 22:ధర్మపురి నృసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళయింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 దాకా 13 రోజులు అంగరంగ వైభవంగా జరుగనుండగా, ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి 29కిలోమీటర్లు, కరీంనగర్ నుండి 70 కిలోమీటర్ల దూరాన ఉంటుందీ క్షేత్రం. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ పవిత్రతను చాటుకుంటున్నది.
శ్రీలక్ష్మీ నర్సింహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శార్వరి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ నవమి అనగా.. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 5 దాకా వరకు 13 రోజుల పాటు జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మార్చి 24న ఉదయం 11గంటలకు యజ్ఞాచార్యుల ఆహ్వానం, కళశ,విశ్వక్షేన, వాసుదేవ పుణ్యాహవాచనం, బ్రహ్మ కళశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం, పుట్ట బంగారం తేవడం. 25న సాయంత్రం 6 గంటలకు గోధూళి సుముహూర్తాన శేషప్ప కళావేదికపై స్వామి వార్ల కల్యాణోత్సవం, 26న రాత్రి 7గంటలకు శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి ఊరేగింపు సేవ, 27న రాత్రి 7గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామివారి ఊరేగింపు, 28న మధ్యా హ్నం 3గంటలకు బ్రహ్మపుష్కరిణి (కోనేరు)లో శ్రీపాత(యోగా) నర్సింహ స్వామివార్ల తెప్పోత్సవం, డోలోత్సవం, 29న మ ధ్యాహ్నం 3గంటలకు కోనేరులో శ్రీకొత్త(ఉగ్ర) లక్ష్మీనర్సింహస్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవం, 30న మధ్యా హ్నం 3గంటలకు కోనేరులో శ్రీవేంకటేశ్వరస్వామివార్ల తెప్సోత్సవం, డోలోత్సవం, సాయంత్రం 5గంటలకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి దక్షిణ దిగ్యాత్ర, 31న సాయంత్రం 4గంటలకు ఉత్తర దిగ్యాత్ర, రాత్రి 7గంటలకు వేద సదస్సు, బోగ మండప ఉత్సవం, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర స్వామివారి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలు, రాత్రి 8గంటలకు దోపోత్సవం, ఏప్రిల్ 2న ముగ్గురు స్వాముల రథోత్సవం, ఏప్రిల్ 3న రాత్రి 7గంటలకు వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం, రాత్రి 9గంటలకు శ్రీయోగా నర్సింహస్వామివారి ఏకాంతోత్సవం, 4న రాత్రి 7గంటలకు శ్రీ ఉగ్ర నర్సింహస్వామి పుష్పయాగం, రాత్రి 9గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఏకాంతోత్సవం, 5న రాత్రి 9 గంటలకు శ్రీ ఉగ్ర నర్సింహస్వామివారి ఏకాంతోత్సవ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.