లుధియానా, సెప్టెంబర్ 17: రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు నెలలు గడిచింది. అక్కడ ఇంకా యుద్ధం ముగియలేదు, ఇక్కడ చదువు కొనసాగించే దారి దొరకలేదు. కేంద్ర ప్రభుత్వం కనికరిస్తుందనుకొన్నా, ఆ ముచ్చటే లేదని తెగేసి చెప్పింది. ఏ విద్యార్థికీ భారత మెడికల్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చోటు ఇవ్వటం కుదరదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు అంధకారం అవుతుందన్న ఆందోళనతో విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్ బాట పడుతున్నారు. అక్కడ యుద్ధం కొనసాగుతున్నా, ఇక తప్పదని చదువు కోసం పయనమవుతున్నారు. మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం మధ్య చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా అక్కడికి మళ్లీ వెళ్తున్నారు. ‘అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్’ కింద వేరే యూరోపియన్ దేశాల్లోని యూనివర్సిటీలకు వెళ్లాలంటే కొన్ని సమస్యలు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంటున్నామని విద్యార్థులు తెలిపారు.
యుద్ధం ప్రారంభం కాగానే విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలండ్, హంగేరీ, స్లొవేకియా, రొమేనియా సరిహద్దులు దాటుకొంటూ స్వదేశానికి చేరుకొన్నారు. ఇప్పటికీ ఉక్రెయిన్ గగనతలం మూసివేసే ఉన్నది. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడికి వెళ్దామనుకొంటే పోలండ్, స్లొవేకియా, రొమేనియా దేశాలు వీసాలు నిరాకరిస్తున్నాయి. దీంతో మాల్డోవా దేశం గుండా విద్యార్థులు ఉక్రెయిన్లోకి అడుగుపెడుతున్నారు. మాల్డోవా ఈ-వీసాలు జారీ చేయటం, అదీ 3-7 రోజుల్లోనే వస్తుండటంతో విద్యార్థులు ఆ దేశం గుండా వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్(టర్కీ), అక్కడి నుంచి చిసినావ్ (మాల్డోవా) చేరుకొంటున్నారు. అక్కడి నుంచి బస్లో ఉక్రెయిన్లోకి ప్రవేశిస్తున్నారు. భారత్ నుంచి ఉక్రెయిన్కు చేరుకోవటానికి విద్యార్థులు దాదాపు రూ.లక్ష ఖర్చు చేస్తున్నారు.