School dormitory | దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానా దేశంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. స్కూల్ వసతిగృహం భవనంలో చెలరేగిన మంటలు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. అనేక మంది గాయపడ్డారు. గయానా ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధాని జార్జిటౌన్కు 200 కిలోమీటర్ల దూరంలోని నైరుతి సరిహద్దు పట్టణమైన మహ్దియాలోని ఒక సెకండరీ స్కూల్ భవనం వసతి గృహంలో ఆదివారం అర్థరాత్రి హఠాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి.
ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకుని మరణించారు. అనేక మంది గాయపడ్డారు. బాధితులంతా 12-18 ఏండ్ల వయసున్న వారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని రాజధానికి తరలించి చికిత్స అందజేస్తున్నామని ఒక అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో వాతావరణం కూడా సరిగ్గా లేదని ఉరుములతో భారీ వర్షం పడటంతో బాధితులను వాయు మార్గంలో తరలించడానికి, సహాయ చర్యలకు ఇబ్బంది ఏర్పడుతున్నదని ఆ దేశ జాతీయ రక్షణ సలహాదారు గెరాల్డ్ గవియా తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి దర్యాప్తు జరపాలని విపక్ష నేత నటాషా సింగ్ లూయిస్ డిమాండ్ చేశారు.