Iran-Israel Conflict | ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలు స్వాధీనం చేసుకున్న ఓ వాణిజ్య నౌకలోని మొత్తం 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నారని అధికార వర్గాల కథనం. వారిని విడిపించేందుకు ఇరాన్ అధికారులతో విదేశాంగశాఖ సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంఎస్సీ ఏరైస్ అనే వాణిజ్య నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తమకు తెలుసు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇంకా ఈ వివాదం తీవ్రతరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్కు తేల్చి చెప్పింది.
హెలికాప్టర్ సాయంతో తమ నేవీ ప్రత్యేక బలగాలు వాణిజ్య నౌకను వెంబడించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయని ఇరాన్ మీడియా కథనాలు వెలువరించింది. అంతకుముందు ఓ వాణిజ్య నౌకను ఇరాన్ సీజ్ చేసిన సంగతి బ్రిటన్ కు చెందిన యూకే మారిటైం ఏజెన్సీ కూడా బయట పెట్టింది. ఈ వాణిజ్య నౌకను తమ సముద్ర జలాల్లోకి తీసుకెళ్తున్నట్లు ఇరాన్ నేవీ వెల్లడించింది. పోర్చుగల్ జాతీయ పతాకంతో వస్తున్న ఈ వాణిజ్య నౌకకు లండన్ కేంద్రంగా పని చేస్తున్న జోడియాక్ మారిటైం సంస్థతో అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ బిలియనీర్ ఏయల్ ఆఫర్ కు చెందిన సంస్థ జోడియాక్ గ్రూప్ అనుబంధ సంస్థే జోడియాక్ మారిటైం.