పంజ్షీర్పై గెలిచామంటూ సంబురాల్లో దారుణం
కాబూల్, సెప్టెంబర్ 4: పంజ్షీర్ లోయను ఆక్రమించుకున్నట్టు శుక్రవారం తాలిబన్లు ప్రకటించారు. ఈక్రమంలో కాబూల్లోని పలు వీధుల్లో సంబురాలు చేసుకున్నారు. ర్యాలీలు నిర్వహించారు. గాల్లోకి తుపాకులు పేల్చారు. ఈ ఘటనలో 17 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. అయితే, ఫైటర్ల ప్రకటనను ఉత్తర కూటమి సేనలు తోసిపుచ్చాయి. పంజ్షీర్ తమ ఆధీనంలోనే ఉన్నట్టు ప్రకటించాయి. మరోవైపు, అఫ్గాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఆమోదించేలా తమ ప్రభుత్వ నిర్మాణం ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గత అఫ్గాన్ ప్రభుత్వ ఈ-మెయిల్స్ను యాక్సెస్ చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ మెయిల్స్ను గూగుల్ నిలిపివేసినట్టు ఓ నివేదిక పేర్కొంది.
తాలిబన్లకు సాయంగా పాక్ ఆర్మీ
పంజ్షీర్ను ఆక్రమించడానికి తాలిబన్లకు పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తున్నదని తాజాగా రుజువైంది. ఉత్తరకూటమి సేనలతో ఘర్షణలు సాగిస్తున్న తాలిబన్లకు పాక్ సైనికులు సాయపడ్డారు. ఈక్రమంలో పాక్ జవాను ఒకరు ఆ ప్రాంతంలో మరణించాడు. ఈ విషయాన్ని ధ్రువపరుస్తూ ఆ ప్రాంతంలో పడివున్న పాక్ సైనికుడి గుర్తింపు కార్డు వెలుగుచూసింది.