కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించి నేటితో 23 రోజులైంది. ఇంకా అనేక నగరాలపై రష్యా సేనలు దాడులతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 14,200 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తన ఫేస్బుక్ పోస్టులో తెలిపింది. కానీ ఉక్రెయిన్, రష్యా మాత్రం తమ సైనికుల విషయంలో భిన్న లెక్కల్ని ప్రకటిస్తున్నారు. అయితే మార్చి 3వ తేదీన రష్యా తన ప్రకటనలో 498 మంది సైనికులు మృతిచెందినట్లు చెప్పుకున్నది. కానీ ఆ తర్వాత ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ప్రస్తుత దాడిలో రష్యా సుమారు ఏడువేల మంది సైనికుల్ని కోల్పోయినట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 14 వేల మంది జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో రష్యా సైనిక దళానికి భారీ నష్టం జరిగింది. ఎన్నో యుద్ధ వాహనాలు ధ్వంసం అయ్యాయి. రష్యాకు చెందిన 450 యుద్ధ ట్యాంక్లు, 93 విమానాలు, 112 హెలికాప్టర్లును పేల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. 43 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేశారు. మరో వైపు మారిపోల్లో భీకర పోరు సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఆ నగరం రష్యా ఆధీనంలోకి వెళ్లనున్నట్లు భావిస్తున్నారు.