వాషింగ్టన్: భారత-అమెరికా సంతతికి చెందిన 11 ఏళ్ల నటాషా పేరి ( Natasha Peri ) రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఆమె బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్టులో పేరు సంపాదించింది. 84 దేశాలకు చెందిన సుమారు 19వేల మంది విద్యార్థులు పాల్గొన్న పరీక్షలో ఆమె టాప్లో నిలిచింది. అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ నిర్వహించిన ట్యాలెంట్ టెస్టులో ఆమె అగ్రస్థానాన్ని సంపాదించింది. సాండ్మేయర్ ఎలిమెంటరీ స్కూల్లో నటాషా చదువుకుంటోంది. సీటీవై ట్యాలెంట్ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఎస్ఏటీ, ఏసీటీ పరీక్షల్లో నటాషా అత్యుద్భుత ప్రదర్శన ఇచ్చింది. చురుకుగా ఉన్న విద్యార్థుల్లో అకాడమిక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సీటీవై పరీక్షలు నిర్వహిస్తుంటారు. 2021 సీజన్లో జాన్స్ హాప్కిన్స్ ట్యాలెంట్ టెస్టుకు నటాషా పేరీ హాజరైంది. అయిదవ గ్రేడ్ చదువువుతున్న ఆ విద్యార్థిని.. వర్బల్, క్వాంటిటేవివ్ సెక్షన్లో.. గ్రేడ్ 8 పర్ఫార్మెన్స్ను ప్రదర్శించింది. సీటీవై ఇచ్చే హై హానర్స్ అవార్డుకు నటాషా ఎంపికైంది.