Road Accident | థాయిలాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. లూనార్ ఇయర్ హాలీడే సందర్భంగా విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది.
లూనార్ ఇయర్ సెలవులను ఎంజాయ్ చేసేందుకు బ్యాంకుకు 12 మందితో వెళ్తున్న వ్యాను సిఖియో జిల్లాలో బోల్తాపడింది. దాంతో వ్యానులో మంటలు చెలరేగాయి. ఒక వ్యక్తి కిటికి నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకోగా.. మంటలు విస్తృతంగా వ్యాపించడంతో మిగతా వారికి వ్యానులో నుంచి దిగడం కష్టమైంది. దాంతో వారంతా ఆ వ్యానులో సజీవదహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 11 మృతదేహాలను దవాఖానకు తరలించారు. ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తి ఈ ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదని చెప్తున్నాడు. నిద్రలోకి జారుకున్న తాను మిగతా వారు కేకలు వేయడంతో మేల్కొని వ్యాన్ మంటల్లో ఉండటం చూసి వెంటనే దూకేశానని చెప్పాడు.
వ్యాన్ మంటలు అంటుకున్న కొద్ది సేపటికే పేలిపోయిందని స్థానిక రెస్క్యూ టీమ్కు చెందిన నిఖోమ్ జియోన్ తెలిపారు. 30 సెకండ్ల వ్యవధిలో వ్యాన్ మొత్తం కాలి బూడిదైందని ఆయన చెప్పారు. మంటలు అంటుకున్న వెంటనే తాము వచ్చినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయామని, మంటలు మొత్తం వ్యానుకు విస్తరించడంతో వారంతా మంటలకు కాలిన గాయాలతో చనిపోయారన్నారు. వ్యాన్ బోల్తా పడిన తర్వాత ఇంధనం బయటకు రావడం వల్లనే మంటలు చెలరేగడమే కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతున్నది.