టెల్అవీవ్: పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. (104 killed in Israeli fire) 280 మంది గాయపడ్డారు. మృతదేహాలను, కాల్పుల్లో గాయపడిన వారిని లారీల్లో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కార్యాలయం ఈ సంఘటనపై స్పందించింది. నబుల్సి రౌండ్అబౌట్ వద్ద సహాయ సామగ్రి లారీల కోసం వేచి ఉన్న ప్రజలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ ఆక్రమణ సైన్యం జరిపిన దారుణమైన మారణకాండను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. గాజాలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 30,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. శిథిలాల్లో వేలాది మంది సజీవ సమాధి అయ్యారు.
కాగా, ఉత్తర గాజాకు సహాయక లారీలు వచ్చినప్పుడు జనం పెద్ద సంఖ్యలో నెట్టుకోవడం, తోసుకోవడం వల్ల పలువురు గాయపడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అయితే తమకు ముప్పుగా భావించిన ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా ప్రజలపై కాల్పులు జరిపినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.