జెనీవా/కీవ్, జూన్ 3: ఫిబ్రవరి 24,2022.. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించిన రోజు. శుక్రవారంతో 100వ రోజుకు చేరింది. ఈ వంద రోజుల్లో సాగించిన విధ్వంసకాండలో ఉక్రెయిన్లో అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి. ఎక్కడ చూసినా బాంబుల మోత. ఎప్పుడు, ఎక్కడి నుంచి బాంబులు వచ్చి పైన పడతాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. బాంబు వర్షంతో ఉక్రెయిన్లోని ప్రభుత్వ నిర్మాణాలతో సహా అనేక నగరాల్లోని వేలాది భవనాలు నేలకూలాయి. ఈ శిథిలాల కింద వందలాది శవాలు. దీనికితోడు రష్యా సేనలు ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకొని పాల్పడిన దురాగతాలు చెప్పలేనివి. వందల మంది హత్య చేసి సామూహిక ఖననాలు చేశారని, మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఉక్రెయిన్ అధికారులతో పాటు అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు ఘోషించాయి. ఇటువంటి భయానక పరిస్థితుల నేపథ్యంలో లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు కట్టుబట్టలతో శరణార్థులుగా పొరుగుదేశాలకు వలస వెళ్లిపోయారు.
ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన
ఇంత చేసినా.. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలని అనుకున్న పుతిన్ ప్లాన్ను అధ్యక్షుడు జెలెన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఊహించని ఈ పరిణామంతో ఆక్రమణలు ఆలస్యం, ఆక్రమించుకున్న ప్రాంతాలను కూడా తిరిగి అప్పగించి వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్పై రష్యా దృష్టి సారించింది. అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక ఆంక్షలతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.