న్యూఢిల్లీ : అమెరికాలోని న్యూయార్క్లో మహాత్మ గాంధీ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని శనివారం దుండులు ధ్వంసం చేశారు. మాన్హటన్ యూనియన్ స్వ్కేర్లో 8 అడుగుల ఎత్తున్న గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. ఈ ఘటనను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. స్ధానిక అధికారుల దృష్టికి ఈ ఉదంతాన్ని తీసుకువెళ్లామని కాన్సులేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని అమెరికా విదేశాంగ శాఖను కోరామని కాన్సులేట్ తెలిపింది.
జాతిపిత, మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాల్లోని భారత సంతతికి చెందిన సంఘాలు (ఎఫ్ఐఏ) స్పష్టం చేశాయి. శాంతి, అహింసకు కట్టుబడి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణను చూరగొన్న మహాత్ముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడం, అవమానించడం అత్యంత విచారకరమని ఎఫ్ఐఏ చైర్మన్ అంకుర్ వైద్య పేర్కొన్నారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఘటనకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని వైద్య తెలిపారు. జాతిపిత, మహాత్మగాంధీ విగ్రహాన్ని అవమానించిన దుండగులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ తాము మేయర్కు లేఖలు రాస్తామని చెప్పారు.
గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని సమకూర్చగా 1986, అక్టోబర్ 2న ఆవిష్కరించారు. అమెరికన్ పౌర హక్కుల నేత బయద్ రస్టిన్ కీలకోపన్యాసం చేశారు. కాగా అమెరికాలో గతంలోనూ గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూశాయి. గత ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని పార్క్లో మహాత్మగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 2020 డిసెంబర్లో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ ఉద్యమ అనుకూలురు అపవిత్రం చేశారు.