జైసల్మేర్/న్యూఢిల్లీ, మార్చి 12: భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ రాజస్థాన్లోని జైసల్మేర్లో మంగళవారం కూలిపోయింది. శిక్షణా కార్యక్రమాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధవిమానం ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి. దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ప్రమాదానికి ముందే విమానం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని, ఈ ప్రమాదానికి కారణాలేమిటో తేల్చేందుకు విచారణకు ఆదేశించామని భారత వాయుసేన (ఐఏఎఫ్) వెల్లడించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారికి దాదాపు 100 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కల్లా, జవహర్ రెసిడెన్షియల్ కాలనీల వద్ద ఈ విమానం కూలిపోవడంతో ఓ హాస్టల్ భవనంలో కొంత భాగం ధ్వంసమైందని, ఆ సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీస్ అధికారులు తెలిపారు.
హెచ్ఏఎల్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తేజస్ యుద్ధవిమానాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 40 తేజస్ యుద్ధవిమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఐఏఎఫ్ కోసం 83 తేజస్ ఎంకే-1ఏ విమానాలను కొనుగోలు చేసేందుకు 2021లో హెచ్ఏఎల్తో ఒప్పందం కుదుర్చుకున్న రక్షణ శాఖ.. వాయుసేన కోసం అదనంగా మరో 97 తేజస్ విమానాలను సమీకరించేందుకు గతేడాది నవంబర్లో ప్రాథమిక ఆమోదం తెలిపింది.