కేపీహెచ్బీ కాలనీ, జూలై 28 : పరిసరాల పరిశుభ్రత కోసం బాధ్యతగా పనిచేయాలని, ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉండాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అధికారులను ఆదేశించారు. బుధవారం జోన్ కార్యాలయంలో పారిశుధ్యం, చెత్త తరలింపుపై ఆయా సర్కిళ్ల డీసీలు, పారిశుధ్య, ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులతో జడ్సీ మమత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జోన్ పరిధిలో పారిశుధ్య పనులు మెరుగుపర్చడానికి డీసీలు, ఏఎంహెచ్వోలు, ట్రాన్స్పోర్ట్ ఏఈలు ఉదయం ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. చెత్త తరలింపు వాహనాలు, రోజు వారీ ట్రిప్పుల వివరాలను పరిశీలించాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కొత్త స్వచ్ఛ ఆటోల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని, అర్హులకు మాత్రమే ఆటోలను అందించాలన్నారు. కార్మికులు, ఆటోల హేతుబద్ధీకరణ ప్రక్రియను ఆగస్టు 1వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. పారిశుధ్య కార్మికులందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అలాగే, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో సమావేశాలు నిర్వహించి పారిశుధ్య కార్మికులను వారికి పరిచయం చేయాలని, వందశాతం స్వచ్ఛతను సాధించేలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, ప్రశాంతి, మంగతాయారు, అనురాధ, ఆయా సర్కిళ్ల ఏఎంహెచ్వోలు, ట్రాన్స్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.