మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 26: జిల్లాలో 18 ఏండ్లు నిండిన యువతీ,యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదులో భాగంగా జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు.తూంకుంట, దేవరయాంజాల్, మచ్చబొల్లరం పోలింగ్ బూత్లలో బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ)లు ఓటరు నమోదుకు చేపడుతున్న కార్యక్రమాలు, ఇప్పటి వరకు ఎంత మందిని కొత్తగా ఓటర్లుగా నమోదు చేశారనే వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల పేర్లను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. మృతి చెందిన వారు, వివాహమై వెళ్లిన వారు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారితో పాటు రెండు చోట్ల ఓటర్లుగా నమోదై ఉంటే వాటిని వెంటనే తొలగించాలని అదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండాలని, గతంలో ఓటర్లిస్టు ఏమైనా సవరణ ఉంటే సరిచేయాలన్నారు. ఈ నెల 27న ఓటరు నమోదు ఉంటుందని, జిల్లాలోని అర్హులైన యువతీ, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, బూత్ లెవల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్, నవంబర్ 25: అర్హులందరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కౌన్సిలర్ కౌడె మహేశ్ కోరారు. మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.