జవహర్నగర్, ఫిబ్రవరి 12 : దేశాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఎన్నో సంస్కరణలతోనే ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో రోజ్గార్ మేళా-12 కేంద్ర సంస్థలకు చెందిన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, గిరిజన, రెవెన్యూ, హోంశాఖ, ఉన్నత విద్యా, అణు ఇంధన, రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకమైన 259 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మురుగన్ మాట్లాడుతూ రోజ్గార్ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ హాయంలో 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాన మంత్రి మోదీ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు 3లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అనేక మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ సునీల్ ఇమ్మానియేల్, డీఐజీ శ్రీనివాస్, అగ్నిమాపక శిక్షణ సంస్థ(ఎఫ్ఎస్ఐ) డీఐజీ, జేకే తివారి, అధికారులు, కొత్తగా నియామితులైన ఉద్యోగుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.