వెంగళరావునగర్, అక్టోబర్ 24: పాత కక్షలతో ఓ యువకుడిని బండరాళ్లతో మోది రౌడీషీటర్ హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.వి.రామప్రసాదరావు కథనం మేరకు.. బాపూనగర్కు చెందిన తరుణ్(22) డిగ్రీ మధ్యలోనే మానేశాడు. అతడికి బల్కంపేటలోని రేణుకానగర్కు చెందిన రౌడీషీటర్ షరీఫ్(35) మిత్రుడు. గతంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. సెల్ఫోన్ గొడవలో షరీఫ్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో తరణ్పై షరీఫ్ కక్ష పెంచుకున్నాడు. సోమవారం రాత్రి తరుణ్కు పరిచయమైన మిత్రులతో అతడిని దాసారం బస్తీలోని గుడిసెల ప్రాంతానికి షరీఫ్ రప్పించాడు. అందరూ కలిసి మద్యం తాగారు. అక్కడ తరుణ్, షరీఫ్ మధ్య ఘర్షణ తలెత్తింది.
దీంతో షరీఫ్ ఫోన్చేసి తన అనుచరులను అక్కడికి రప్పించాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన గొడవలో తరుణ్పై షరీఫ్, అతడి అనుచరులు బండరాళ్లతో తలపై మోదారు. తరుణ్ అపస్మారక స్థితిలోకి చేరాడు. బస్తీవాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రావడంతో షరీఫ్, అతడి అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వెంటనే తరుణ్ను అమీర్పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజాము 5 గంటల సమయంలో తరుణ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తరుణ్ తండ్రి జె.రూప్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు షరీఫ్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తరుణ్ హత్య స్థానిక బాపూనగర్, దాసారాం పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.