Crime News | సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): బడా వ్యాపార వేత్తగా బిల్డప్ ఇస్తూ.. మ్యాట్రీమోని వెబ్సైట్ల ద్వారా పెళ్లిళ్ల కోసం ప్రయత్నిస్తున్న యువతులను మోసం చేస్తున్న ఘరానా దంపతులను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ శ్వేత కథనం ప్రకారం.. యెలిగంటి రంజిత్ అలియాస్ రాధాకృష్ణ అలియాస్ రాకేశ్, సంధ్య దంపతులు. ఉప్పల్ పరిధిలోని ఫిర్జాదిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. 2022లో తమ సెల్ఫోన్ను ఆపరేట్ చేస్తూ.. తెలుగు మ్యాట్రీమోని వెబ్సైట్లను పరిశీలించాడు. ఆ సమయంలో చాలా మంది యువతులు మ్యాట్రీమోని వెబ్సైట్లలో పెండ్లి కోసం తమ ప్రొఫైల్స్ అప్లోడ్ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు.
దీంతో అతడు కూడా నిత్య పెండ్లి కొడుకు అవతారమెత్తాడు. యాప్లో ప్రొఫైల్ చూసి, పెండ్లికి సిద్ధం.. నేను ఫలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నా.. నీ జీతం ఇంతా.. నేను బిల్డర్ను, ఫలానా వద్ద నా వెంచర్ నడుస్తున్నది.. ఇలా ధనవంతుడిగా తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అతడి భార్య కూడా సహకరిస్తూ పరిస్థితులను బట్టి ఆమె ఒక్కో రకమైన వేషం మార్చింది. యువతులకు అతడిపై నమ్మకం కుదరగానే.. పర్సనల్గా కలుద్దామంటూ చెప్పి.. మాటలు కలుపుతాడు. ఆ తరువాత తనకు అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చిందంటూ.. కట్నం డబ్బులో మినహాయించుకోవచ్చు అంటూ.. రకరకాల కారణాలు చూపుతూ యువతుల వద్ద నుంచి అందినకాడికి దోచేశారు.
ఈ ఘటనపై కొందరు బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇన్స్పెక్టర్ భిక్షపతి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో బాధితులను, లక్షల్లో మోసాలు చేసినట్లు విచారణలో బయటపడింది. షాదీ.కామ్, తదితర మ్యాట్రీమోని సైట్లలో పెండ్లి సంబంధాలు చూసే సమయంలో వారి వారి ప్రొఫైల్ను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ దంపతుల బారినపడి మోసపోయిన వారెవరైనా ఉంటే.. పోలీసులను సంప్రదించాలని సూచించారు.