హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad ) బాచుపల్లిలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. ప్రగతినగర్లో తన తల్లితో కిలిసి ఉంటున్నాడు. గతేడాది స్థానికంగా జరిగిన ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన అతడు రెండు నెలల క్రితం విడుదలయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సిద్దూ తల్లి ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న తేజస్ తన మిత్రులైన మహేశ్, శివప్ప, సమీర్తో కలిసి దావత్ చేసుకున్నాడు.
అయితే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రగతినగర్లోని బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన వ్యక్తి స్నేహితులు 20 మంది బైకులపైవచ్చి తేజస్ను కత్తులతో పొడిచి చంపారు. అనంతరం నిందితులు సెల్ఫీ వీడియో తీసి ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామని అందులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.