Instagram | వెంగళరావునగర్, ఆగస్టు 20 : ఇన్స్టాలో తనను ఫాలో కాకుంటే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ పదిహేనేండ్ల బాలికను బెదిరించాడో ఆకతాయి. ఆ ఆకతాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జవహర్నగర్కు చెందిన ఓ బాలిక గతనెల 23న బస్తీలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ముఖానికి మాస్క్ ధరించిన ఓ గుర్తు తెలియని యువకుడు బాలికను అడ్డగించాడు. ఆమె ఫొటోలు తన ఫోన్లో ఉన్నాయంటూ.. తన ఫోన్లోని ఫొటోలు చూపించాడు. ఇన్స్టాగ్రామ్లో తనను ఫాలో కావాలని చెప్పాడు. ప్రతిరోజు తనతో మాట్లాడాలని సూచించాడు. తనతో మాట్లాడకున్నా.. ఇన్స్టాలో ఫాలో కాకపోయినా.. వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తానని హెచ్చరించాడు. ఇంట్లో వారికి చెబిబే చంపేస్తానని బెదిరించాడు.
భయబ్రాంతులకు గురైన బాలిక తనను వేధింపులకు గురి చేయవద్దని పలుమార్లు వేడుకుంది. అయినప్పటికీ మళ్లీ ఈనెల 16న బాలికను రోడ్డుపై ఆపి.. ఆమె చేతిపై ఇన్స్టాగ్రామ్ ఐడీ రాశాడు. ఫాలో కాకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. బాలిక తన కుటుంబీకులకు విషయం చెప్పింది. మధురానగర్ పోలీసులకు గుర్తు తెలియని యువకుడి వేధింపులపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.