సిటీబ్యూరో/చాదర్ఘాట్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): పోలీసులకు ఎంత టెక్నాలజీ అందించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దని చెబుతున్నా.. ఇటీవల క్షేత్ర స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనే పోలీసుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. తప్పిపోయిన కొడుకు కోసం తల్లిదండ్రులు 20 రోజులుగా వెతుకుతున్నా…రోడ్డు ప్రమాదానికి గురై, మృతి చెందింది అతడేనన్న విషయాన్ని గుర్తించలేని స్థితిలో పోలీసులు ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మూడో రోజు అతడు మృతి చెందాడు. అనాథ శవంగానే మృతదేహాన్ని భద్రపరిచారు. అదృశ్యమైన కొడుకు ఐదు రోజులైనా ఇంటికి రాకపోవడంతో అదే పోలీస్స్టేషన్లో తన కొడుకు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా చాదర్ఘాట్ పోలీసులకు చీమ కుట్టినట్లు కూడా కాలేదు. కుటుంబసభ్యులే దవాఖానలు, బస్స్టాండ్లు తిరుగుతూ.. తన కొడుకు మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉన్నదని తెలుసుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యానికి ప్రత్యక్షంగా నిలిచిన ఈ ఘటనను నిరసిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరగడం, చికిత్స పొందుతూ అతడు మృతి చెందడం, అదే పోలీసు స్టేషన్లో అదృశ్యం కేసు నమోదు కావడం.. ఈ మూడు జరిగినా పోలీసులు కనీసం పట్టించుకోలేదని, 20 రోజులుగా నగర వ్యాప్తంగా తిరుగుతున్నా పోలీసులకు చీమ కుట్టినట్లు కూడా లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, చేసిన తప్పు పెద్దది కాకుండా ఉండేందుకు పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
ఎందుకీ నిర్లక్ష్యం..?
హిట్ అండ్ రన్ కేసులను పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. కానీ, చాదర్ఘాట్ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వెనుక ఏమి జరిగిందనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. నల్గొండ క్రాస్రోడ్డులో సీసీ కెమెరాలున్నాయి. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించే అవకాశాలున్నాయి. యువకుడు గుర్తు తెలియని వ్యక్తి కావడంతో, వాహనాన్ని గుర్తించి వదిలేశారా..? ఇంకా ఏదైనా జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాదర్ఘాట్ పోలీసులపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా నిద్రలో ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ఎవరు విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలకు ఈ ఘటన ప్రత్యక్షంగా నిలుస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన వారి కోసం గాలిస్తున్నామంటూ చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి..
ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నల్గొండ క్రాస్రోడ్డు చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో చాదర్ఘాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో గుర్తుతెలియని వ్యక్తిగానే రికార్డులో నమోదు చేయించారు. చికిత్స పొందుతూ అతడు ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తిగా ఉండటంతో ఆ మృతదేహాన్ని మార్చురీలో భద్ర పరిచారు.
అదృశ్యం కేసు నమోదు..
బయటకు వెళ్లిన కొడుకు శ్రావణ్కుమార్ (23) ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి ఫొటోను చూపిస్తూ ఈ నెల 11న మలక్పేటలో ఉండే తల్లిదండ్రులు చాదర్ఘాట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. లుక్ అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. అదే పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిని దవాఖానలో చేర్పించిన పోలీసులు.. అతడు మృతి చెందాడనే విషయంపై ఏ మాత్రం పట్టించు కోలేదు. మార్చురీలో ఉన్న మృతదేహం ఎవరిదనే విషయన్ని కూడా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులే శ్రావణ్ కోసం గాలించారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహాన్ని గుర్తించి, వారే చాదర్ఘాట్ పోలీసులకు సమాచారమిచ్చారు.