హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు విరాళాలతో తమవంతుగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపునందుకుని పలువురు గొప్పగా స్పందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి పుణ్యక్షేత్రానికి తమ వంతుగా బంగారం, నగదు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ జాబితాలో మాక్ (ఎంఏకే) గ్రూప్ కూడా చేరింది. తమ సంస్థ తరఫున యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని విరాళంగా సమర్పించినట్టు ‘మాక్’ (MAK) గ్రూప్ చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి ప్రకటించారు. చారిత్రకమైన, అద్భుతమైన పవిత్ర యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణంలో తమ వంతుగా బంగారం సమర్పించుకోవడం తమకు ఎంతో ఆనందంగా వుందని, అది తమకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు మురళీకృష్ణా రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.