యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 25;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నిత్యపూజా కైంకర్యం అనంతరం స్వామివారు శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మురళీకృష్ణుడిగా దివ్యమైన వేణుగాన నాదంతో సమస్త ప్రాణికోటికి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించిన అపూర్వ స్వరూపం శ్రీకృష్ణావతారమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు వివరించారు. స్వామివారిని రాత్రి పొన్నవాహన సేవపై అధిష్టించి తిరు మాఢవీధుల్లో ఊరేగించారు.
శ్రీకృష్ణ దర్శనం.. సమస్త ప్రాణకోటికి మోక్షం
భగవానుడి అవతారాలల్లో అపూర్వమైనది శ్రీకృష్ణావతారం. ఎన్నో అద్భుతాలను దర్శింపజేసిన కృష్ణావతారంలో మురళీకృష్ణుడిగా తన దివ్యమైన వేణుగాననాదంతో సమస్త ప్రాణకోటికి చైతన్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని అందించినట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పరమాత్మగా కృష్ణుడు జీవాత్మలకు ప్రతీకమైన గోవులు, గోపాలురను, గోపికలను మధురానగర భక్తులను రక్షించి, ఆనందింపజేసి అనుగ్రహించిన అవతారమే శ్రీకృష్ణావతారమనిశ్రీకృష్ణావతార అలంకార దర్శనం ఎంతో ముక్తిదాయకమని
ప్రధానార్చకులు చెప్పారు.
నేడు గోవర్ధనగిరిధారిగా నారసింహుడు స్వామివారు ఆదివారం ఉదయం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి సింహవాహన సేవపై తిరుమాఢవీధుల్లో ఊరేగనున్నారు.
పొన్న వాహన సేవ ఇలా..
భక్తపారాయణుడు, జగదక్షకుడు, శ్రీమహావిష్ణువు లోకకల్యాణార్థం అవతరించిన అవతార రూపాల్లో లక్ష్మీనరసింహస్వామి దివ్యవాహన సేవలు అందుకుంటున్నారు. రాత్రి ప్రధానాలయంలో స్వామివారి నిత్యకైంకర్యాల అనంతరం ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణికులు స్వామివారిని పొన్న వాహన సేవలో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. వేదపురాణ, ఇతిహాస ప్రవచనాలు, సాహిత్యం, శాస్త్రం, వేదం, నాదం వంటి వైదృశ్యాలతో స్వామివారి వాహన సేవ ప్రధానాలయ తిరు మాఢవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. పంచసూక్తాలు, ఉపనిషత్తులు పఠిస్తుండగా ఆలయ తిరుమాఢవీధుల్లో స్వామివారి సేవ కొనసాగింది. పశ్చిమ దిశలో గల వేంచేపు మండపంలో స్వామివారిని ఆస్థానం చేశారు. స్వామివారి అలంకారమైన నాలుగు వేదాలు, పొన్న వాహన సేవ సూక్తులను పఠించారు. దివ్య ప్రబంధంలోని వాహనసేవ వైభవ పాశురాలను పఠిస్తూ స్వామివారి సేవ విశిష్టతను ప్రధానార్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. తిరుమాఢవీధుల్లోని ఉత్తర దిశలో నిర్మించిన సాంస్కృతిక మండపంలో కళాకారుల నాట్యాలు, సంగీత విద్వాంసుల కచేరీలు భక్తులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. శనివారం చెన్నైకి చెందిన శ్రీదేవి నృత్యాలయం ఆధ్వర్యంలో భరతనాట్యం, మంజుల రామస్వామి కళాకారులచే భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. డాక్టర్ శివప్రసాద్, మోండలిన్ విద్యాంసులు యు.పి.రాజు ఆధ్వర్యంలో ఈల పాట సంగీత కచేరీ భక్తులను మైమరిపించింది.
భక్తకోటికి అనుగ్రహం
పొన్న వృక్షమును దేవవృక్షంగా పురాణాలు పేర్కొన్నాయని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. అందుకే దానికి కల్పవృక్షమని, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు అని పేరు.