Telangana | సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ) : తెలంగాణ, తమిళనాడులో పర్యావరణహితమైన విధానాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, గ్రీన్ కవర్ కూడా భారీగా పెరిగిందని, గ్లోబల్ సిటీగా ఎదిగేందుకు పునరుత్పాదక, సహజ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే ప్రణాళికలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని పర్యావరణవేత్తలు అన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో గ్రీన్ మేనిఫెస్టో సాధనకు రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం అంశంపై జాతీయస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్, కౌన్సిల్ ఫర్ ఎర్త్ లీడర్షిప్ అండ్ సస్టయినబిలిటీ, హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నార్వేకు చెందిన పర్యావరణవేత్త ఎరిక్ సొల్హిమ్, పర్యావరణవేత్తలు ప్రొ.పురుషోత్తం రెడ్డి, డా. నర్సింహారెడ్డి దొంతి, ఎకనామిస్ట్ గురు స్వామి, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించేలా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పలువురు పర్యావరణవేత్తలు అన్నారు. ఈ సందర్భంగా పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. 70 శాతానికి పైగా ఆధారపడిన వ్యవసాయ రంగంపై పర్యావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఆర్థిక, సామాజిక, మానవ నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా గ్రీన్ మేనిఫెస్టో తయారీకి జాతీయ స్థాయిలో సింపోజియం నిర్వహిస్తున్నామన్నారు. దశాబ్ద కాలంగా పర్యావరణ పాలసీల రూపకల్పన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ కృషి చేస్తుందని, ఇటీవల ఢిల్లీలోనూ న్యాయ, పర్యావరణ, సామాజిక, ఆర్థిక వేత్తలతో గ్రీన్ మేనిఫెస్టో సాధనకు జాతీయ స్థాయిలో ప్రత్యేక చర్చాగోష్ఠిలను నిర్వహించినట్లుగా ఏపీ ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి తెలిపారు.
పర్యావరణ సంరక్షణపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని నార్వేకు చెందిన పర్యావరణవేత్త ఎరిక్ సొల్హిమ్ అన్నారు. సదస్సులో పాల్గొన్న ఆయన అగ్రదేశాల్లో సహజ వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం, జీరో ఎమిషన్ విధానాలపై దృష్టి సారించినట్లుగా తెలిపారు. ఇందులో చైనా, ఐరోపా దేశాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడి వాతావరణం, చెరువుల సంరక్షణ, అర్బన్ ఫారెస్ట్రీ విధానాలు, పర్యావరణహితమైన మెట్రో రైలు అన్ని కూడా వాతావరణంలో కాలుష్యాన్ని నియంత్రించేవన్నారు.