అమీర్పేట్ ( హైదరాబాద్ ) : సనత్ నగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. గురువారం అమీర్పేట్ డివిజన్లోని కుమ్మరిబస్తీలో ఆయన పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికలకు ముందు కుమ్మరి బస్తీలో మంజూరైన మంచినీటి, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం వంశీకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే రోడ్డు నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కోట్లాది నిధులు వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు.
వీటిలో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ ఇందిర, డీఈఈ మోహన్, స్ట్రీట్లైట్స్ డీఈ కిరణ్మయి, బీఆర్ఎస్ అధ్యక్షులు ఎం. హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్ పాల్గొన్నారు.