సిటీబ్యూరో , జనవరి 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు, ఇందులో జీహెచ్ఎంసీలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 25 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా నిత్యం 772 మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగునీటిని శుభ్రం చేయడం కోసం ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది.2036 వరకు రాబోయే కాలంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో 978 ఎంఎల్డీల సామర్థ్యం గల ఎస్టీపీలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి జీహెచ్ఎంసీ పరిధిలో వందశాతం మురుగునీటిని శుద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని ఎస్టీపీలను నవంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో నాలుగింటికి సాంకేతిక సమస్యల అడ్డంకులు తొలగాల్సి ఉంది.
నెల రోజుల్లో అందుబాటులోకి తొలి ఎస్టీపీ..
దుర్గం చెరువు వద్ద జలమండలి నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ)ని నెల రోజుల్లో అందుబాటులోకి తేనున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. దుర్గం చెరువు, కోకాపేట్, అత్తాపూర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎస్టీపీలను మంగళవారం ఆయన సందర్శించారు. ఏడు ఎంఎల్డీల సామర్థ్యం, సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మిస్తున్న దుర్గం చెరువు ఎస్టీపీ సివిల్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే మిగతా వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మూడు షిఫ్టుల్లో పనులు చేస్తూ త్వరగా పూర్తి చేయాలన్నారు.పనులు జరిగే ప్రాంతం లో కార్మికులు తగిన భద్రతా చర్యలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఎస్టీపీల ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం కోసం గార్డెనింగ్, మొకలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఈడీ డా.ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మా ణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.