కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 28 : జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాలనీలు, బస్తీలలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కొన్నిచోట్ల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి లేకుండా పనులు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న తాగునీటి పైప్లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ పనులను చేపట్టడంలో ఎదురయ్యే ఇబ్బందులను జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు కలిసి పరిష్కరించాలన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి జీఎం ప్రభాకర్, ఎస్ఈ చిన్నారెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని క్రీడా ప్రాంగణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావును కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కలిసి క్రీడా ప్రాంగణంలో వసతులు కల్పించాలని వినతిపత్రం అందించారు. క్రీడా ప్రాంగణంలోని బాస్కెట్బాల్ కోర్టులో ఫైబర్ గ్లాస్ బోర్డ్స్, గార్డెన్ బెంచీలు ఏర్పాటు చేయాలని, బాస్కెట్బాల్ గ్రౌండ్ ఫ్లోరింగ్కు మరమ్మతులు చేయాలని, వాలీబాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులలో ఎర్రమట్టితో చదను చేయాలని, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిత్యం వందమందికి పైగా క్రీడాకారులు ఆడుకునే ఈ మైదానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాస్కెట్బాల్ కోచ్, అసోసియేషన్ కార్యదర్శి అంజిబాబు తదితరులున్నారు.
సెంట్రింగ్ కార్మికులకు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ట్విన్ సిటీస్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కూకట్పల్లి జోన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం.ధర్మారావు, ప్రధాన కార్యదర్శి డి.తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు శాంతారావు, కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో కష్టపడి పనిచేస్తున్న సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్థానికంగా నివసించే కార్మికులందరికీ అండగా ఉంటానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు హరినాథ్, దారాసింగ్ ఉన్నారు.