ఇంటి నుంచి పనిచేస్తున్నామన్న మాటే గానీ.. ఆఫీసులో కన్నా రెట్టింపు ఒత్తిడికి గురవుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నా వేళకు భోజనం చేయడం లేదు. సమయానికి నిద్ర పోవడం లేదు. దీంతో తమకు మానసిక శ్రమ, ఒత్తిడి పెరిగిపోతున్నాయని సహచరులతో ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా కార్యాలయాలు తెరుచుకునే వరకు దైనందిన జీవితం, పెరిగిన పని శ్రమను ఎలా సమన్వయపరుచుకోవాలో మానసిక నిపుణులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు.
వర్క్ఫ్రమ్ హోం చేస్తున్న వారికి ఒత్తిడి పెరిగినా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే అన్ని పనులు సక్రమంగా చేయగలరు. ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయాలంటే సంయమనమే పెద్ద టూల్. మానసిక ప్రశాంతత కోసం మధ్య మధ్యలో..ఐదు నిమిషాలు, పది నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఆ సమయాల్లో స్నాక్స్, టీ, జ్యూస్ తీసుకోవడంతో మరింత శక్తిని పొందగలుగుతారు. ప్రతి రోజూ యోగా, ధ్యానం చేయడంతో ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. – కవిత, మానసిక వైద్యనిపుణురాలు