అబిడ్స్, జనవరి 9 : లేడీస్ డేను పురస్కరించుకొని నుమాయిష్లో మహిళలు సందడి చేశారు. జనవరి 1న ప్రారంభమైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో మంగళవారం ప్రత్యేకించి మహిళలకు కేటాయించారు. దీంతో మధ్యాహ్నం నుంచి మహిళలు పెద్ద ఎత్తున నుమాయిష్కు తరలివచ్చారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో లేడీస్ డే సందర్భంగా గాంధీ సెంటినరీ హాల్ పక్కనే ఉన్న పెండాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఎగ్జిబిషన్ సొసైటీకి అనుబంధంగా ఉన్న విద్యా సంస్థల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు వనం సత్యేందర్, కార్యదర్శి బి. హన్మంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్ సింగ్, కోశాధికారి ఏనుగుల రాజేందరకుమార్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అదే విధంగా లేడీస్ డే కమిటీ సలహాదారురాలు అనిత, కన్వీనర్ గాయత్రి, జాయింట్ కన్వీనర్లు మాధవి, అఖిల సంగం పర్యవేక్షించారు. 20 వేల మందికిపైగా మహిళలు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ కన్వీనర్ టి. చంద్రశేఖర్ తెలిపారు.