ACP Ravinder | బేగంపేట, ఆగస్టు 27: ఓ మహిళ వేగంగా పరుగెత్తుకుంటూ.. నేరుగా బందోబస్తు డ్యూటీలో ఉన్న ఏసీపీ వద్దకు వచ్చింది. సార్ నేను.. అంటూ.. గుర్తు చేసింది. ఒక్కసారిగా అక్కడున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకొని హ్యాట్సాఫ్ పోలీస్.. అని అన్నారు. వివరాల్లోకి వెళితే.. మహంకాళి ఏసీపీ రవీందర్ యాదవ్ 2014లో టప్పాఛబుత్ర పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో కార్వాన్కు చెందిన కవిత రోడ్డుపై అనారోగ్యంతో బాధ పడుతుంటే ఆస్పత్రిలో చేర్పించి.. తన సొంత డబ్బుతో చికిత్స, ఆపరేషన్ చేయించారు. ఈ ఘటన జరిగి దాదాపు పదేళ్లు కావస్తుంది. కాగా, ఆదివారం ఆ మహిళ సికింద్రాబాద్ మీదుగా బస్సులో వెళ్తోంది.
సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ఆదివారం జరిగిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమానికి ఏసీపీ రవీందర్ యాదవ్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. బస్సులో వెళ్తున్న కవిత ఏసీపీ రవీందర్ యాదవ్ను చూసి, గుర్తించింది. బస్సు దిగి ఏసీపీ వద్ద పరుగుతీసుకుంటూ వచ్చింది. సార్, “నేను కవితను.. నేను ఈ రోజు బతికి ఉన్నానంటే మీరే కారణం సార్”.. అంటూ కన్నీరు పెట్టుకుంది. అన్నా.. మీ కోసం వెండి రాఖీ తీసుకున్నా.. పండుగ రోజు వచ్చి కడుతానని చెప్పి.. ఏసీపీ ఫోన్ నంబర్ తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు హ్యాట్సాఫ్ పోలీస్.. అంటూ.. ఏసీపీకి కృతజ్ఞతలు తెలిపారు.