ఎర్రగడ్డ : సంపూర్ణ అక్షరాస్యత మహిళా వికాసానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన స్థానిక జయశంకర్ కమ్యూనిటీహాల్లో మహిళలకు కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ చదువుతో పాటు వివిధ కోర్సులలో శిక్షణ పొంది మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు.
సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసి పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని.. ప్రభుత్వం అమలుపర్చుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన శుభవార్త వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు.
ఈ కానుకల పంపిణీ కార్యక్రమానికి డివిజన్ నుంచి వందలాది మంది మహిళలు తరలి వచ్చారు. అందరికీ గోపీనాథ్, బాబా ఫసియుద్దీన్లు కానుకలను అందజేసి పలువురు మహిళలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, రవినాయుడు, యూసుఫ్, మేరీ, ధనలక్ష్మి, రమేష్నాయక్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.