హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో విషాదం చోటుచేసుకున్నది. చట్నీ విషయంలో వచ్చిన గొడవ భార్య బలవన్మరణానికి దారితీసింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోప తండాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన (25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ వద్ద డ్రైవర్గా పని చేస్తుండగా.. చందన ఓ నగల దుకాణంలో వర్క్ చేస్తున్నది. ఇద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్లోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో చట్నీ విషయంలో ఇద్దరిమధ్య గొడవజరిగింది. అనంతరం సోమవారం ఉదయం రమణ యధావిధిగా డ్యూటీకి వెళ్లాడు.
అయితే చందన పలుమార్లు వీడియోకాల్స్ చేసినప్పటికీ అతడు స్పందించలేదు. దీంతో ఫోన్ చేసి కావాలనే గొడవ పడుతున్నావని, తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆందోళనకు గురైన రమణ ఇంటి ఓనర్కు ఫోన్ చేసి.. తన భార్య గొడవ పెట్టుకొని చనిపోతానంటుందని, ఓసారి తన రూంకి వెళ్లి చూడాలని కోరాడు. దీంతో ఇంటి ఓనర్ ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిచూడగా.. అప్పటికే ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కాగా, రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నామని, చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదుచేసిన తర్వాత కేసు నమోదుచేస్తామని వెల్లడించారు.