Neetu Bai | సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మత్తు దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. ఇందులో గంజాయి డాన్ నీతూ బాయ్ కూడా ఉన్నది. వివరాలివి..ఐటీ కారిడార్లో గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న గంజాయి డాన్ నీతుబాయ్తో పాటు ఆమె బంధువులు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్న 13 మంది యువకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నీతుబాయ్ అండ్ గ్యాంగ్ వద్ద నుంచి విక్రయించేందుకు ఉంచిన 22.6 కిలోల గంజాయిని, రూ.22.10 లక్షల నగదుతోపాటు మరో రూ.12.30 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
నానక్రాంగూడ లోథాబస్తీకి చెందిన కాలావతి నీతూబాయ్(46) తన కుటుంబ సభ్యులతో కలిసి గంజాయి విక్రయిస్తున్నది. ఆమెపై 18 కేసులు నమోదు కాగా, అనేకసార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చింది. ఆమె భర్త కాలావతి మున్ను సింగ్ (53) ఇతర కుటుంబ సభ్యులు సైతం గంజాయి, గుడుంబా, మద్యం విక్రయిస్తూ గతంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ దందాల ద్వారానీతుబాయ్, ఆమె కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టారు. నీతుబాయ్పై సైబరాబాద్ పోలీసులు 2021లో పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. 2022 అక్టోబర్లో జైలు నుంచి విడుదలైన నీతుబాయ్ తిరిగి గంజాయి వ్యాపారం చేయడం ప్రారంభించింది.
2023 ఆగస్టులో నీతుబాయి తన బంధువులు కాలావతి గౌతం సింగ్, నేహబాయ్లతో కలిసి గంజాయి విక్రయిస్తుండగా గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి ఆమె 16 బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.1.53 కోట్ల నగదును ఫ్రీజ్ చేయడంతోపాటు రూ.4 కోట్ల ఆస్తులను సైతం సీజ్ చేశారు. అనంతరం జైలు నుంచి విడుదలైన తరువాత నీతుబాయ్ గంజాయి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించింది. ధూల్పేటకు చెందిన అంగూరీ బాయ్ వద్ద నుంచి కిలో రూ.8వేల చొప్పున కొనుగోలు చేసి 5 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి ఒక్కో ప్యాకెట్ను రూ.500 చొప్పున ఐటీ కారిడార్లో విక్రయిస్తోంది. గచ్చిబౌలి పోలీసులు, టీఎస్ నాబ్ అధికారులు బుధవారం నీతుబాయ్ నివాసంలో తనిఖీలు చేసి.. నీతుబాయ్, ఆమె భర్త మున్ను సింగ్, సురేఖ, మమతలను అరెస్టు చేశారు.