శంషాబాద్ రూరల్, ఆగస్టు 1: కారు సన్రూఫ్ విండోలో నిలబడి ఓ యువతి ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నగరంలోని బంజారాహిల్స్లో నివాసముండే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫీరోజ్ఖాన్ కూతురు తానియా (22) డ్రైవర్ మీర్జా, దియా అనే ముగ్గురు కలిసి ఆదివారం రాత్రి సమయంలో టీఎస్ 13 ఈవీ 5243 నంబర్ గల కారులో బంజారాహిల్స్ నుంచి బయల్దేరి గచ్చిబౌలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డులో శంషాబాద్ వరకు వచ్చి, తిరిగి శంషాబాద్ నుంచి సాతంరాయి మీదుగా మెహిదీపట్నం అక్కడి నుంచి బంజారాహిల్స్కు వెళ్లేందుకు వస్తుండగా సాతంరాయి సమీపంలో జాతీయ రహదారిలో అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢికొనడంతో ఆదే సమయంలో సన్రూఫ్ విండోలో ఉన్న తానియా ఎగిరి కిందపడిపోయింది.
దీంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ మీర్జా అలీ, మరో మహిళ దియాకు స్వల్ప గాయాలు కావడంతో వారిని స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించారు. ప్రమాదం అర్దరాత్రి జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.