నాంపల్లి కోర్టులు, మే 23 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్పోర్టు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మద్రాసు హైకోర్టు ఎదురుగా ఉన్న మ్యాట్ ఎంటర్ప్రైజెస్లో సేల్స్ అడ్మిన్గా పనిచేస్తున్న ప్రియా ధర్మలింగం అనే మహిళను ఈ కేసులో 27వ నిందితురాలిగా చేర్చి, అరెస్టు చేశారు. ఆమెను రెండు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ గురువారం సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. చంచల్గూడ మహిళా జైలులో ఉన్న నిందితురాలికి అధికారులు నోటీసులు జారీ చేశారు. పేరియస్వామితో 2020లో ప్రియకు పెళ్లి జరిగింది. చెన్నైలో వీరిద్దరు మూడేండ్లు కలిసి జీవనం సాగించారు. ఇద్దరి మధ్య ఏర్పడిన తగాదాల నేపథ్యంలో గతేడాదిగా భర్తకు దూరంగా ఉంటున్న ప్రియకు మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లినా, అనివార్య కారణాల వల్ల పెళ్లి జరగలేదు. మోహన్కు ఏజెంట్లతో ఉన్న పరిచయాల గురించి ఫోన్ ద్వారా ప్రియకు చేరవేశాడు.
శ్రీలంకకు చెందిన వారి వివరాలను ప్రియకు అందించాడు. మోహన్ నెథర్ల్యాండ్లో ఉంటూనే ఫోన్ద్వారా ఏజెంట్ మురళి, గ్జేవియర్ నంబర్లను ప్రియకు అందజేయడంతో ఈ వ్యవహారాన్ని ఆమె నడిపింది. ఈ పరిచయం ప్రియను కటకటాల్లోకి నెట్టింది. ఆమెను సీఐడీ అధికారులు చెన్నైలో అరెస్టు చేసి, 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మోహన్తో ఆమెకు ఏర్పడిన పరిచయంతో శ్రీలంకకు చెందిన వారికి నకిలీ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులను మురళి (ఏ13), జాన్ గ్జేవియర్ (ఏ19) సహాయంతో తయారు చేయించి, పాస్పోర్టులకు దరఖాస్తు చేసింది. శ్రీలంక జాతీయులైన 21 మందికి నకిలీ భారత పాస్పోర్టులను రూపొందించి, వారికి అందజేసింది. నకిలీ పాస్పోర్టుల తయారీ కోసం మురళికి ఆన్లైన్ ద్వారా డబ్బులను పంపించినట్టు సీఐడీ విచారణలో వెల్లడైనట్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె నుంచి మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నదని కోరారు. ఆమెను విచారిస్తే శ్రీలంకకు చెందిన జాతీయులు ఎంతమంది ఏజెంట్లను సంప్రదించారో అన్న విషయం తెలుస్తుందన్నారు. సమయం సరిపోకపోవడంతో ప్రియను పూర్తి స్థాయిలో విచారించలేకపోయామన్నారు.