రెండేండ్లుగా సొంత వ్యాన్లోనే యువతి జీవనం
కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని అనుమానం
స్టేహోంలో ఆశ్రయం కల్పిస్తామన్న పోలీసులు
వెంగళరావునగర్, మార్చి 29 : హాస్టల్లో చెల్లించాల్సిన డబ్బులు లేకపోవడంతో..రెండేండ్ల క్రితం ఓ యువతి తన సొంత వ్యాన్నే ఇంటిగా మార్చుకుంది. మూడేండ్ల క్రితం మధురానగర్కు వచ్చిన అనిత ఇక్కడి రాజ్ దూత్ లేడీస్ హాస్టల్ లో ఏడాది పాటు నివాసం ఉంది. రెండేండ్ల క్రితం అనితను హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. దీంతో తన సొంత వ్యాన్ నే ఇల్లుగా మార్చుకుంది. స్థానికులు పెట్టే ఆహారాన్ని తింటూ.. వ్యాన్లోనే జీవనం కొనసాగిస్తుంది. మూడేండ్లుగా ఈ వ్యాన్ ఇక్కడే ఉన్నట్టు ట్రాఫిక్ చలాన్ల రికార్డుల ద్వారా తెలిసింది. రోడ్డుపై పార్కింగ్ చేశారని ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యాన్ పై చలాన్లు విధించారు. కాగా వ్యాన్లో నివాసముంటున్న అనిత పరిస్థితి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ వ్యాన్ తనదేనని..దాని పేరు గుర్రం అని చెప్పింది.
ట్రాఫిక్ ఈ చలాన్ యాప్ పరిశీలించగా ఏపీ 31 క్యూ 6434 నంబరు గల ఈ వ్యాన్ గుర్రం అనిత పేరు మీదే రిజిస్టరై ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల గురించి ఆరా తీయగా..వారి వివరాలు చెప్పడానికి నిరాకరించింది. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని..అందుకే వారికి దూరంగా ఇలా వ్యాన్లోనే అనిత జీవితాన్ని గడుపుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి యువతికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామని..స్టేట్ హోంలో చేర్పించి ఆశ్రయం కల్పించడం గాని..లేదా ఆమెను కుటుంబీకులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తామని ఎస్ఆర్నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు వెల్లడించారు.