నాంపల్లి క్రిమినల్ కోర్టు, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆరు నెలల పసికందును హత్య చేసిన కేసులో ఓ మహిళకు నాంపల్లి క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
భవనీనగర్కు చెందిన అర్షియా బేగం అలియాస్ నజియా ఇంట్లో తోటి కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు తార స్థాయికి చేరడంతో అర్షియా బేగం తన తోటి కోడలిపై కక్ష పెంచుకుంది. దీంతో తోటి కోడలి ఆరునెలల పసికందును తీసుకొని బావిలో వేసింది. పసికందు చనిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు భవానీనగర్ పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద అర్షియా బేగంపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలు పరిశీలించిన న్యాయస్థానం నిందితురాలికి జైవిత ఖైదుతో పాటు ఐదువేలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం తీర్పునిచ్చింది.