462 గ్రూపులకు రూ.26.26కోట్ల
వడ్డీ లేని రుణాలు మంజూరు
4,620మంది మహిళలకు లబ్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు
మల్కాజిగిరి, మే 31: మహిళలు స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి కోసం పది మంది కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాలు తీసుకుని సొంతగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో 462గ్రూపులు సర్కిల్ ప్రాజెక్ట్ కార్యాయంలో నమోదు చేసుకున్నారు. వీరికి అధికారులు స్వయం ఉపాధి ఎలా పొందాలో ప్రాథమికంగా అవగాహన కల్పిస్తున్నారు. 462గ్రూపులకు రూ.26,26కోట్ల ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది. ప్రతి గ్రూపునకు ఒక లీడర్ ఉంటుంది. ప్రాజెక్ట్ అధికారులు తరచూ గ్రూప్ లీడర్లతో అవగాహన సమావేశం నిర్వహిస్తున్నారు. వారికి వస్తున్న సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి కోసం టైలరింగ్, కూరగాయల షాపు, పూల అమ్మకం, ఇంట్లో పల్లిలను గానుగ పట్టి నూనెలు తీసి వ్యాపారం చేస్తున్నారు. వీరికి మంచి గిరాకీ ఉంది. కల్తీ లేని నూనె కావడంతో వినియోగదారు లు ఎగబడి కొంటున్నారు. అధికారులు తరచూ షాపుల వద్దకు వెళ్లి వ్యాపార వివరాలను తెలుసుకుని నమోదు చేస్తున్నారు.
మహిళలను ప్రోత్సహిస్తున్నాం..
స్వయం ఉపాధి కోసం మహిళలకు ప్రోత్సహిస్తున్నాం. సర్కిల్ పరిధిలో ఎస్హెచ్జీ 462గ్రూపులకు రూ.26,26 కోట్ల వడ్డీ లేని రుణాలను మంజూరు చేశాం. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధులో వంద మందికి ఒక్కొక్కరికి రూ.10లక్షల ఆర్థిక సహాయం చేసి సొంతగా యూనిట్లను ఏర్పాటు చేశాం. ఇందులో సగం మంది మహిళలు ఉన్నారు. సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల సమన్వయంతో మరిన్ని గ్రూపులను ఏర్పాటు చేస్తాం.
–ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు