సుల్తాన్ బజార్, జూన్ 4: ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు రోగులున్నారనడంలో వాస్తవం లేదని, గవర్నర్ను చూసేందుకు చాలా మంది రోగులు బెడ్లపై వాలిపోయారని, అంతే కాకుండా బెడ్లపై ఉన్న రోగుల్లో చాలా మంది డిశ్చాైర్జెనవారే అని, వారు కూడా గవర్నర్ను చూసి వెళ్దామని పడకలపై అలాగే ఉండిపోయారని ఉస్మానియా వర్గాలు స్పష్టం చేశాయి. ఉస్మానియా దవాఖానకు నిత్యం వేల మంది రోగులు ఓపీ, ఐపీ సేవల కోసం వస్తుంటారని, సామర్ధ్యానికి మించి రోగులు వచ్చినా ఎవరిని కాదనకుండా ఇక్కడ చికిత్స అందించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఉస్మానియా దవాఖాన కార్పొరేట్కు దీటుగా సేవలందిస్తుందని, దీనిని గుర్తించిన గవర్నర్ ఉస్మానియా వైద్య సిబ్బందిని పొగడ్తలతో ముంచెత్తడం హర్షనీయమని ఉస్మానియా దవాఖాన అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుల ఆధ్వర్యంలో ఉస్మానియా దవాఖానాలో అల్ట్రా మోడరన్, ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకురావడంతో వైద్యుల చేత రోగులకు మెరుగైన వైద్య సేవలను అందజేస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ గుర్తించారన్నారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం, ఆరోగ్య తెలంగాణ సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దవాఖానలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఆధునీకరించడం వల్ల కార్పొరేట్కు దీటుగా హై అండ్ ప్రొసీజర్లను, నాణ్యమైన పేషెంట్ కేర్ సేవలను అందించగలుగుతున్నామని అధికార వర్గాలు వివరించాయి. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు, సున్నితమైన న్యూరో సర్జికల్ విధానాలు ఇతర అనేక ఖరీదైన సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు.
స్కిన్ బ్యాంక్ వంటి ప్రత్యేక సేవలు ఉస్మానియాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఎల్జీబీటీ జనాభా యొక్క ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చే ప్రత్యేక లింగ మార్పిడి క్లినిక్, పెయిన్ క్లినిక్లను సైతం ఉస్మానియాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిమోఫీలియా సెంటర్ ప్రతి యేడాది వందలాది మంది హిమోఫీలిక్ రోగులకు ఖరీదైన హిమోఫీలిక్ కారకాలను అందిస్తున్నదని, నేషనల్ వైరల్ హెపటైటీస్ సెంటర్ ఆధ్వర్యంలో వందలాది రోగులకు ఉచితంగా చికిత్సతో పాటు టీకాలను అందజేస్తున్నదని వివరించారు.
ఉస్మానియాలో 1092 పడకలు ఉండగా, 889 మంది రోగులు వైద్య చికిత్సలు పొందుతున్నారని, నిర్దిష్ట రోజులలో కొన్ని వార్డులు నిండుగా ఉంటాయని, మరికొన్ని వార్డులు నిండవని తెలిపారు. వైద్యుల రౌండ్ల అనంతరం, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అందుబాటులో ఉన్న అన్ని పడకలలో సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు. క్యూక్యూడీసీ భవనంలో 660 పడకలు ఉండగా, 592 మంది రోగులు, ఓపీ భవనంలో 350 పడకలు ఉండగా, 254 మంది రోగులు, జీహెచ్ఎంసీ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లో 70 పడకలు ఉండగా, 33 మంది రోగులు, ఎల్సీయూలో 12 పడకలు ఉండగా, 10 మంది రోగులు ఉన్నారని వివరించారు.