సిటీబ్యూరో, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ): ‘వింగ్స్ ఇండియా-2022’ పేరుతో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ప్రారంభమైన ఏవియేషన్ షో రెండో రోజు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక వ్యాపార అంశాల చర్చాకార్యక్రమాలతో జోరుగా సాగింది. ఏవియేషన్ ఇండస్ట్రీకి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు పాల్గొని సంబంధిత రంగంలో ఎదురవుతున్న అవరోధాలు, పరిష్కారాలపై సమగ్రంగా చర్చించారు. మరోవైపు వైమానిక ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నది. 11 ఎయిర్క్రాఫ్ట్స్ వరుసలో మరో స్పైస్ జెట్ చేరింది. వైమానిక విడిభాగాల ప్రదర్శనలో వ్యాపార ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి. విమానం ఎలా నడుస్తుంది? అందుకు కావాల్సిన విడిభాగాలు మార్కెట్లో ఏయే ధరల్లో అందుబాటులో ఉంటాయి? వాటి మరమ్మతులకు ఉపయోగించాల్సిన టెక్నాలజీ ఏమిటీ? డ్రోన్లను ఎలా ఉపయోగిస్తారు..? తదితర వ్యాపార అంశాలపై బిజినెస్ ఎగ్జిబిటర్లతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ ఏవియేషన్ షో ఆదివారంతో ముగియనున్నది.
నగరానికి చెందిన ఏఐ క్లౌడ్స్ అండ్ రొడెల్ల టెక్నాలజీ సంస్థ అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారుచేస్తున్నది. దీని ఫౌండర్ కనుమూరి ఎస్.రాజు డిఫెన్స్, అగ్రికల్చర్, సెక్యూరిటీలకు సంబంధించిన డ్రోన్లను రూపొందించడంలో దిట్ట. 500గ్రాముల నుంచి 50 కేజీల బరువు మోసే సామర్థ్యం గల డ్రోన్లను అందిస్తున్నారు. ఈ డ్రోన్లు ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయ రంగంలో ఉపయోగపడే కిసాన్ డ్రోన్లను రూపొందించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్లకు కూడా ఈ సంస్థ డ్రోన్లను అందించనున్నది. నదుల్లో వ్యర్థాలను శుభ్రం చేయడానికి మరో సాంకేతికతను తీసుకురాబోతున్నది. నదిని శుభ్రపరిచే డ్రోన్లను డిజైన్ చేయడానికి సిద్ధమైంది. ఇస్రో సహకారంతో డ్రోన్ కాప్టర్లను కూడా తీసుకొచ్చింది. 40 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించగలిగే డ్రోన్లను అందించారు. అంతేకాదు 40 గంటలు పనిచేసే డ్రోన్ల తయారీకి ఫ్రెంచ్ కంపెనీ ఎలిస్టెయిర్తో ఒప్పందం కుదుర్చుకున్నది.
వ్యవసాయాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక డ్రోన్లను తీసుకొచ్చింది ధన్విక అశ్రీటెక్ సంస్థ. ఇది 20 నిమిషాల్లో సుమారు రెండున్నర ఎకరాల భూమికి స్ప్రే చేయగలదు. రసాయనాలను పిచికారీ చేయగలదు. ఇది ఎలక్ట్రికల్ ఆపరేటివ్ సిస్టంతో నడుస్తుంది. 30 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు. హైదరాబాద్ ఏవియేషన్ షోలో ఈ డ్రోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంస్థ ఫౌండర్ దీపక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రోన్ల వినియోగం విస్తృతంగా ఉందని.. ఇక్కడ అనేక మందితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చెప్పారు.
విమానాల్లో ఏదైన అగ్ని ప్రమాదం జరిగినా.. మరే ఇతర ప్రమాదం సంభవించినా ఎలా ఎదుర్కోవాలనే దానిపై మెలకువలు నేర్పించడానికి ఏ320 పేరుతో బౌద్దార్థ సంస్థ కొత్త పరికరాన్ని రూపొందించింది. ఇది తలకు ధరిస్తే చాలు మన ముందు విమానం ప్రత్యక్షమవుతుంది. చేతికి రిమోట్ కంట్రోలర్ అందిస్తారు. దాని సాయంతో మనం ఏం నేర్చుకోవాలి? విమానం విడిబాగాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలను తెలుసుకోవచ్చని ఫౌండర్ సునిల్ తెలిపారు.
సీఆర్పీఎఫ్ స్టాల్లో సందర్శకులు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. సిబ్బంది కూడా వారితో పాటు ఫొటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. నొయిడా ఎయిర్పోర్టు నమూనా ప్రదర్శన ఎక్స్పోలో ఆకట్టుకుంది. చాలా మంది విమానాశ్రయాన్ని చూడటానికి ఉత్సాహం చూపారు.
సారంగ్ విన్యాసాలు శని, ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12:25 నిమిషాల వరకు, సాయంత్రం 4 నుంచి 4:25గంటల వరకు ఉండనున్నది. ఏవియేషన్ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
హైదరాబాదీలు సాంకేతికతను అందిపుచ్చుకొని వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఏవియేషన్ షోతో మా వ్యాపారం విస్తృతం చేసుకునే అవకాశం దొరికింది. ఇప్పటికే ఫ్రెంచ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు వివిధ అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేస్తున్నాం. మేం ఇండియాలో పదిలక్షల మంది డ్రోన్ ఆపరేటర్లను తయారు చేస్తాం. అందుకోసం పదో తరగతి, కొంచెం ఇంగ్లిష్ తెలిస్తే చాలు డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు. 200గ్రాముల బరువు కంటే ఎక్కువ మోయగల డ్రోన్లకు కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది.
-కనుమూరి ఎస్.రాజు, ఫౌండర్, ఏఐ క్లౌడ్స్