ఆర్.కృష్ణయ్య
అంబర్పేట, మే 26: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు గురువారం కాచిగూడలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బూపేశ్ సాగర్ అధ్యక్షత వహించారు. బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్న కృష్ణయ్యను సీఎం జగన్ రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం సాగర్, విజయేంద్ర సాగర్, కోలా జనార్దన్, బూషేశ్ సాగర్, జోషి రాఘవ, సంతోష్, నిఖిల్, శివ, రఘుపతి, మంజూనాథ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.